31-July-2018-NewsClips

మంగళవారం, జూలై 31, 2018

amr-brk7a.jpg

జిల్లాలో ఈ-అంబులెన్స్‌ యాప్‌
‘మీకోసం’లో వెల్లడించిన కలెక్టర్‌ లక్ష్మీకాంతం

మచిలీపట్నం, న్యూస్‌టుడే: జిల్లాలో నూతనంగా ఈ-అంబులెన్స్‌ యాప్‌ను ప్రారంభిస్తున్నట్టు కలెక్టర్‌ లక్ష్మీకాంతం తెలిపారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మీకోసం కార్యక్రమంలో భాగంగా ఆయన సోమవారం వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌లో రోగికి తక్షణ వైద్య పరీక్షలు నిర్వహించి ప్రత్యేక యాప్‌ ద్వారా సమాచారాన్ని రోగిని తీసుకువెళ్లాల్సిన ఆస్పత్రి వర్గాలకు ఆన్‌లైన్‌ ద్వారా చేరవేస్తారనీ, ఫలితంగా ఆస్పత్రికి చేరిన వెంటనే రోగికి అవసరమైన చికిత్సను ఎటువంటి ఆలస్యం లేకుండా అందించే అవకాశం కలుగుతుందన్నారు. ఈ యాప్‌ ద్వారా ట్రాఫిక్‌ సిగ్నలింగ్‌ సిస్టమ్‌కు కూడా డేటా అనుసంధానం చేస్తారని తద్వారా అంబులెన్స్‌కు ఎటువంటి ట్రాఫిక్‌ అడ్డంకులు లేకుండా మార్గం సుగమం అవుతుందని తెలిపారు. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని సోమవారం జరుపుకుంటున్న విషయాన్ని ప్రస్తావిస్తూ మానవ అక్రమ రవాణా సమాచారాన్ని 181 టోల్‌ఫ్రీ నెంబరుకు తెలియపర్చాలని, అందుకు పాల్పడినవారికి ఐపీసీ సెక్షన్‌ 370 ప్రకారం 5 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారన్నారు. వనం, మనం కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 6 లక్షల మంది స్వయం సహాయక సంఘాల సభ్యులు డ్వామాలో జాబ్‌కార్డులున్న 5 లక్షల మంది ఒక్కొక్కరు 10 మొక్కలు నాటినా కోటి మొక్కల లక్ష్యం సాధించవచ్చన్నారు. కోస్తాతీరం వెంట షెల్టర్‌బెల్ట్‌ ఏర్పాటుకోసం సరగుడు మొక్కలు నాటాలని సూచించారు.గ్రామదర్శిని బుక్‌లెట్‌ను కలెక్టర్‌ ఆవిష్కరించారు. గతేడాది డిసెంబరు 24న జాతీయ వినియోగదారుల దినోత్సవరం సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి సర్టిఫికెట్లు, నగదు బహుమతులను కలెక్టర్‌ అందజేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించారు. పలు అర్జీలకు తక్షణ పరిష్కారం లభించేలా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు.
* మండవల్లి మండలం దయ్యంపాడు అంగన్‌వాడీ కేంద్ర కార్యకర్త పోస్టును భర్తీ చేయాలని గ్రామస్థుడు ప్రకాశరావు అర్జీ ఇవ్వగా తక్షణ నియామకానికి ఆదేశాలు జారీ చేశారు.
* వృత్తి పనులు చేసుకోనీయకుండా అడ్డుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని జి.కొండూరు మండలం వెలగలేరు గ్రామానికి చెందిన భవాని ఫిర్యాదు చేయగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా తహసీల్దార్‌ను ఆదేశించారు.
* మొవ్వ మండలం కాజ గ్రామంలో జడ్పీ పాఠశాల డైనింగ్‌హాల్‌ నిర్మాణం కోసం మ్యాచింగ్‌ గ్రాంటు ఇవ్వాల్సిందిగా వి.తిరుపతిరావు కోరగా తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా ఎస్‌ఎస్‌ఏ అధికారులకు సూచించారు.
* కంచికచర్ల మండలం కీసర టోల్‌ప్లాజా సమీపంలోని షాపులను తొలగించారని, తగు న్యాయం చేయాలని మంగమ్మ, తదితరులు కోరగా చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు.
* గుడివాడ బేతవోలులో మున్సిపల్‌ స్థల ఆక్రమణలు అరికట్టాలని సుబ్బారావు అర్జీ సమర్పించగా వెంటనే చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ కమిషనర్‌, ఆర్డీవోలకు సూచించారు.
* ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలని ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు ఆవుల గోపినాధ్‌, తదితరులు వినతిపత్రం అందజేశారు.
* ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఏఐఎవైఎఫ్‌ జిల్లా సమితి ఆధ్వర్యాన ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు విజ్ఞాపనపత్రం ఇచ్చారు. బీ పెడన నియోజకవర్గ పరిధిలోని బంటుమిల్లి, రామరాజుపాలెం కాల్వలకు సాగునీరు సక్రమంగా సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని వైకాపా నాయకుడు ఉప్పాల రాంప్రసాద్‌, తదితరులు వినతిపత్రం అందజేశారు.

Leave a comment